KTR :త్వరలో జిల్లాల పర్యటనకు కేటీఆర్

త్వరలో జిల్లాల పర్యటనకు కేటీఆర్
హైదరాబాద్-
BRS 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అందులో భాగంగా వరంగల్లో లక్షలాదిమంది పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనునట్లు పార్టీ ప్రకటించింది.
పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించబడింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణ పై కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోనున్నారు. పార్టీకి ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతున్న విషయాన్ని కేటీఆర్ తెలియజేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన, కేసిఆర్ పైనే ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయబోతున్నారు. కేటీఆర్ పర్యటనల వలన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నిండనున్నది.