Terrorist Attack:జమ్మూకశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతి
పర్యటకులే లక్ష్యంగా దాడులు
సౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని భారత్ వచ్చి..రివ్యూ చేసిన ప్రధాని మోదీ
సాయిసూర్య, తెలంగాణ బ్యూరో: పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. మొత్తం ఆరుగురు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
కాగా... పహల్గామ్ ఘటనతో జమ్మూకశ్మీర్ (JammuKashmir)పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న టూరిస్టులు వారి నివాస స్థలాలకు పయనమవుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో నిండిపోయింది. రద్దీ దృష్ట్యా విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. మరోవైపు ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను పెంచారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఉగ్రదాడికి నిరసనగా జమ్మూకశ్మీర్లో బంద్కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వారందరూ లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారని, కనీసం వారిలో ఇద్దరు విదేశీయులని భావిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపు కొనసాగుతోంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రతినిధి గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ నిన్నటి దాడికి బాధ్యత వహించింది.
పహల్గాం ఉగ్రదాడి మృతుల భౌతికకాయాలకు కేంద్రమంత్రి అమిత్ షా(Amith Shah) నివాళులర్పించారు. అనంతరం శ్రీనగర్లో బాధిత కుటుంబాలతో అమిత్ షా భేటీ అయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని అమిత్షా పరిశీలించారు. అమిత్ షా వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.
ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని(Hyderabad) ట్యాంక్బండ్ దగ్గర బీజేపీనేతలు నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్ నిరసనలో పాల్గొన్నారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు నివాళులర్పించిన కిషన్రెడ్డి.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని..ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని మండిపడ్డారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్టేనని హెచ్చరించారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.